అనాది జాతికి ఆచార్యుడెవరు? : శ్రీ హెబ్బార్
సమాజంలో ఎంతటి ఉన్నతుడైనా గురువు మార్గదర్శకం లేనిదే విద్యలు అబ్బవు. అందువల్లనే రఘురాముడు, యదుకుల కృష్ణుడు వంటి మహనీయులు సైతం గురువు వద్ద విద్యలను నేర్చుకున్నారు. ‘‘గురువు, గోవిందుడు ఒకేసారి మన ఎదుటికి వచ్చినప్పుడు ఎవరికి ముందు నమస్కరించాలి? గురువుకే నమస్కరించాలి. ఎందుకంటె గోవిందుడు దేవుడని మనకు చెప్పేవాడు గురువు మాత్రమే.’’ - గురు గోవింద్ దోవూఖడే, కాకే లాగూపాయ్? బలిహారీ గురూ ఆప్కీ గోవింద్ దియో బతాయ్ - అని హిందీ కవి కబీర్దాస్ వివరించాడు.
ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురుపౌర్ణమిగా, గురు పూజా దినోత్సవంగా అనాదిగా ప్రసిద్ధి కెక్కింది. అదే రోజున ద్వాపర యుగంలో వేదవ్యాసుడు జన్మించినట్టు ఇతిహాసం చెపుతోంది. సత్యవతీ పరాశరులకు కృష్ణద్వైపాయనుడన్న పేరుతో జన్మించాడు వ్యాసుడు , అనాదిగా ఉన్న వేదాన్ని కలియుగంలో సామాన్యులకు సౌలభ్యంగా ఉండే విధంగా నాలుగుగా విభజించాడు. అందువల్లనే ఆయనకు వేదవ్యాసుడన్న పేరు వచ్చింది. ‘‘్ధర్మేచ అర్థ కామేచ, మోక్షేచ, భరతర్షభ! యదిహాస్తి తదయన్యత్ర యనే్నహాస్తి నతత్క్వతిత్’’ - ధర్మార్థ కామమోక్షాల విషయంలో ఇక్కడ - మహాభారతంలో- ఉన్నది మరెక్కడైనా ఉండవచ్చు. ఇక్కడ లేనిది మాత్రం మరెక్కడా లేదు -. మహాభారతం ధర్మమార్గంలో సమాజంలో పయనించడానికి మహోజ్జ్వల దీపిక వంటిది. ఆ దీపికను వెలిగించిన వేదవ్యాసుడు తరతరాలకు గురువయ్యాడు. వరసిద్ధి వినాయకుడే వ్యాసునికి మహాభారతరచనలో లేఖకుడుగా పనిచేశాడు. అలాగే బ్రహ్మసూత్రాలను రచించడం ద్వారా వేద వ్యాసుడు బాదరాయణుడై ఆధ్యాత్మిక గురువయ్యాడు. పద్దెనిమిది పురాణాలను రచించడం ద్వారా కల్పాది నుంచి కల్పాంతం వరకు గల చరిత్రను చెప్పి చారిత్రక గురువయ్యాడు. ఇలా కలియుగం లోని ప్రజలకు వేదవ్యాసుడే తొలి గురువు.
అయితే వ్యాసునికి పూర్వం కూడా సమాజం ఉంది, గురువులు ఉన్నారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విలక్షణమైన శుభగుణానికి ప్రతీకగా భాసిస్తున్నాడు. అనాదిగా ఉన్న భారత జాతికి అసంఖ్యాకమైన మహనీయులు గురువులుగా ఉన్నారు. ఈ మహనీయులందరి శుభగుణాల పరంపర గురుతత్త్వంగా భాసిల్లి సమాజానికి మార్గదర్శనం చేస్తోంది. అందుకే భారతీయులు ఒక గురువును కాక గురు పరంపరను పూజిస్తున్నారు. ఈ గురు పరంపరకు ఒక వ్యక్తి ప్రతీకగా ఉండటం అసాధ్యమైన విషయం. అందుకే ఈ జాతికి చిహ్నమైన అరుణధ్వజాన్ని--- కాషాయం రంగు పతాకాన్ని -- ఆచార్యత్వానికి ప్రతీకగా భావించడం అనాదిగా వైదిక సంప్రదాయం. ఈ కాషాయ ధ్వజమే గురుకులాలపై విలసిల్లి విద్యార్జనలో మార్గదర్శనం చేసింది. ఈ కాషాయ ధ్వజమే దేవాలయాలపై రెపరెపలాడి ప్రజలను ధర్మ మార్గంలో నడిపించింది. ఈ కాషాయ ధ్వజమే పరిపాలకుల విజయ రథాలపై వెలుగొంది జాతి భద్రతను పటిష్టం చేసింది. అందువల్లనే సర్వ శుభలక్షణ శోభితమైన అరుణధ్వజాన్ని భారతజాతి గురువుగా స్వీకరించింది. వేదవ్యాసుని పుట్టిన రోజున గురు పూజను జరుపుకుంటున్నప్పటికీ జరుగుతున్న ఆరాధన వ్యాసునికి మాత్రమే కాదు. ఆయనకు పూర్వం, ఆయన తర్వాత పుట్టి ఈ దేశాన్ని నడిపించిన మహనీయులందరికీ ఇది సమ్మానం. ఈ సమ్మానాన్ని సమర్పించడానికి మాధ్యమం కాషాయధ్వజం. ఈ పతాకం ఉదయించే సూర్యుని రంగులో ఉంది. సమాజం నిరంతరం కాంతివంతమైన సంస్కృతి పథంలో సౌశీల్య మార్గంలో పయనించాలన్నదే గురుపూజ చేయడంలో గల ఆంతర్యం
అనాది జాతికి ఆచార్యుడెవరు? : శ్రీ హెబ్బార్
Reviewed by JAGARANA
on
9:50 AM
Rating:
Post Comment
No comments: